టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో గరుడ పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనం పై తిరుమాడ వీధుల్లో విహరించి.., భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ గరుడవాహన సేవ జరగ్గా.. భక్తులు మలయప్పస్వామివారికి అడుగడుగునా హారతులు పట్టారు. తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శ్రావణమాసంలో శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా “గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహనసేవలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు
