మలక్పేట్ కాల్పుల కేసులో 9 మంది నిందితుల గుర్తింపు..నలుగురు పోలీసుల అదుపులో..!!
హైదరాబాద్: మలక్పేట్లో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు గణనీయంగా పురోగమిస్తోంది. సీపీఐ నేత చందురాథోడ్పై జరిగిన కాల్పుల కేసును పోలీసులు కీలక మలుపు తిప్పారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు తెలిపారు.
చందురాథోడ్ హత్యకు కొంతకాలంగా కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రాజేష్ అనే వ్యక్తి చందురాథోడ్ మధ్య భూముల గట్లపై వివాదాలు సాగుతున్నట్టు ఆధారాలు లభించాయి. ఈ భూమి వివాదాలు కంట్లూర్ పరిధిలో చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.
అంతేకాకుండా, వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. వ్యక్తిగత పరంగా ఏర్పడిన కలహాలే ఈ హత్యకు దారితీశాయని అంచనా వేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో చందురాథోడ్ను నలుగురు నేరుగా హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. వారితో పాటు మరో ఐదుగురు హత్యకు సహకరించినట్టు తేలింది. ఘటన అనంతరం నిందితులంతా చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.
ప్రస్తుతం హత్యకు సహకరించిన నలుగురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఐదుగురి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల పట్ల స్పష్టతకు పోలీసులు చేరుకుంటున్నారు. రాజకీయ కోణం ఉందా..? అన్న అనుమానాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
పరిస్థితి మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు స్థానికంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నరు..
